Skip to content
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపకుండా తాత్కాలిక పనులను చేపట్టడానికి పట్టణ ప్రగతి అనే పేరుతో నగరవాసులను టిఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం డివిజన్ లో శనివారం రాత్రి నిద్ర చేసిన రంగారెడ్డి ఆదివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో వరద ముంపు బాధలు, పార్కింగ్ సమస్యలు పారిశుద్ధ్య లోపం వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు నగర ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాటిని పట్టించుకోని ప్రభుత్వం జిహెచ్ఎంసి అధికారులు ప్రస్తుతం పట్టణ ప్రగతి అనే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో తాత్కాలిక సమస్యలైన గార్బేజ్ లిఫ్టింగ్,చెట్ల నరికివేత పనులు తప్ప శాశ్వత సమస్యల పరిష్కారానికి మా దగ్గర నిధులు లేవని జిహెచ్ఎంసి అధికారులు తేట తెల్లంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియ ప్రణాళిక వారి వద్ద లేనప్పుడు పట్టణ ప్రగతి చేపట్టడం ప్రజాధనం వృధా చేయడమే కాకుండా ప్రజల విలువైన సమయాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ బిజెపి నాయకులు, యువత,కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments